







కథలోకి వెళితే ఆస్ట్రేలియాలో సరదాగా జీవితాన్ని గడిపేస్తుంటాడు చందు ( గోపీచంద్). మార్షల్ ఆర్ట్స్లో ట్రైనింగై దానికి న్యాయం చేయాలంటే ఎవర్ని కొట్టాలనే ఆతృతగా ఎదురుచూస్తుంటాడు. కానీ ప్రతిసారీ నిరాశే ఎదురవుతుంది. తన మామయ్య చంద్రమోహన్ పర్యవేక్షణలో ఉంటాడు. పెళ్లీడుకు వచ్చాడు కనుక తగిన అమ్మాయికోసం వెతుకుతుంటారు. మరోవైపు అంతే సరదాగా జీవితాన్ని గడిపేస్తూ... కోపం వస్తే విపరీతంగా ఎదుటివారిని కొట్టే రకం మహాలక్ష్మిది( త్రిష). అక్కడే తన బాబాయ్ హోటల్ అయిన ఆంధ్రామిర్చి అనే హోటల్లో ఉంటుంది. అనుకోకుండా మహాలక్ష్మిని చూసి చందు లవ్లో పడతాడు. మహాలక్ష్మి మాత్రం ఇష్టపడదు. మధ్యమధ్యలో కొన్ని సంఘటనలతో ప్రేమలో పడుతుంది"కామన్ ప్రతి సినిమాలో". సరిగ్గా ఆ టైమ్లో మహాలక్ష్మి అత్తమ్మ తెలంగాణా శకుంతల వచ్చి తన కొడుకుతో పెళ్లి నిశ్చయమైందని మహాలక్ష్మిని తీసుకుని వెళుతుంది. అయితే చందు విషయం తెలిసిన శకుంతల, దమ్మున్నవాడివైతే కడపవచ్చి నువ్వు ప్రేమించిన అమ్మాయిని తీసుకెళ్లమని రెచ్చగొడుతుంది. దాంతో ఏకంగా కడపలోని ఎర్రగుంటకు వెళ్లడమేకాక నేరుగా మహాలక్ష్మి ఇంటికి వస్తాడు చందు. ఇది చూసిన మహాలక్ష్మి తండ్రి కోట శ్రీనివాసరావు... చందుకు ఓ పని అప్పగిస్తాడు. అది చేస్తే మహాలక్ష్మి నీకు దక్కుతుందంటాడు.. అది ఏమిటి..? చందు దానిని నెరవేర్చాడా...? ఆ తర్వాత ఏం జరిగింది..? అనేది. ఆతృత ఉంటే థియేటర్కు వెళ్లి చూడాలి. మొదటిభాగమంతా ఆస్ట్రేలియాలోనే జరుగుతుంది. ఇంటర్వెల్కు కాస్త ముందు ఇండియా వస్తుంది. ఆస్ట్రేలియా ఎపిసోడంతో అల్లరిచిల్లరిగా ఉంటుంది. హీరో హీరోయిన్ను ఏడిపించడం... వారికి మధ్యలో శ్రీనివాసరెడ్డి అనే ఆర్టిస్టు పోకిరి చేష్టలతో సాగుతుంది. కామెడీ కోసమే శ్రీనివాసరెడ్డిని పెట్టి చేసిన సన్నివేశాలు ఏమాత్రం పండలేదు. గోపీచంద్ సినిమాలో తప్పనిసరిగా ఉండే అలీ ఇందులోనూ ఉన్నాడు. ఈ పాత్ర కాస్త నవ్విస్తుంది. అలీ పెండ్లికి గోపీచంద్ వెళ్లే సన్నివేశం ఏమంత ఆసక్తిగా లేకపోయినా పెండ్లి తర్వాత అలీ చేసే పనులు కొద్దిగా నవ్విస్తాయి. కథంతా సెకండాఫ్లోనే. మహాలక్ష్మి ప్రేమించింది శివయ్య కొడుకునే. ఇద్దరి కుటుంబాలకు బద్ధ విరోధం. ఆ విరోధం కూడా బలంగా లేదు. కాకపోతే... ఊరి జనాల పొలాలను పశుపతి లాక్కుని తన క్వారీలో వారిచేత వెట్టి చాకిరీ చేయిస్తుంటాడు. ఇది అన్యాయం అని తన పొలాలన్నీ శివయ్య పశుపతికి ఇచ్చి వారిని విడిచిపెట్టమంటాడు. ఇంకేముంది శివయ్య దేవుడవుతాడు. ఇది సహించలేని పశుపతి శివయ్యపై పగ పెంచుకుంటాడు. అలా సింపుల్గా వారి మధ్య వైరం పెరుగుతుంది. అది చివరికి శివయ్యను చంపేదాకా వస్తుంది. దాంతో చందు పశుపతిని ఎలా చంపాడు..? అన్నదే సినిమా. నటనాపరంగా తండ్రి చనిపోయే సన్నివేశంలో గోపీచంద్ రెండు నిమిషాలపాటు బాగా నటించాడు. మిగిలినదంతా రొటీన్గానే ఉంది. త్రిష అల్లరిచిల్లరగా చేయడం మినహా పాత్రలో నటనకు ఏమాత్రం ఆస్కారం లేదు. వేణుమాధవ్ రొటీన్ అయినా తన్నులు తింటూ నవ్వు తెప్పిస్తాడు. డాక్టర్ పాత్రలో రఘుబాబు సన్నివేశం, కృష్ణభగవాన్ పాత్రలు రొటీన్. నవ్వు తెప్పించలేదు. తమన్ సంగీతం మామూలుగానే ఉంది. "తకతకదిల్ బరేన్..." గ్రూప్ సాంగ్ కాస్త క్యాచీగా ఉంది. మిగిలినవి సోసో... చిత్రంలో చెప్పుకోవాల్సింది... ఫోటోగ్రఫీ. దర్శకుడు ఇంతకుముందు సినిమాటోగ్రాఫర్ కనుక ఆ దిశగా బాగా చేయించుకున్నాడు. ఇంతకంటే సినిమా గురించి పెద్దగా చెప్పాల్సింది లేదు. మరి మాస్ను ఈ శంఖం ఎంతవరకు ఆకర్షిస్తుందో'అస్సలు నచ్చదని నా అభిప్రాయం చూడాల్సిందే. చివరిగా ఇందులో రెండు అంశాలు వివాదంగా మారే అవకాశాలున్నాయి. 1. టెన్నిస్ ఆట రాకపోయినా చాలామంది ఆ ఆటను ఎందుకు చూస్తారు అనంటే... చిన్న షార్ట్స్తో రాకెట్ పట్టుకుని ఎగిరెగిరి కొడుతుంటే... అందాలు చూడ్డానికని గోపీచంద్ మహాలక్ష్మితో అనడం. 2. క్రిస్టియన్ అయిన అలీ తల్లిదండ్రులు, ముస్లిం అయిన ఆయన మామగారు తమ పద్ధతిలో పెండ్లికావాలంటూ పేచీ పెడుతుంటే, గోపీచంద్ వచ్చి, హిందూ సంప్రదాయం ప్రకారం పెండ్లి చేయిస్తాడు. అంతకు ముందు మరో జంట పెండ్లి చేసుకోవాలని చెప్పి తన ప్రేయసి మహాలక్ష్మితో పెండ్లి చేసుకుంటాడు. ఇదంతా ఉత్తిత్తి పెళ్లే అని ధర్మవరపు అనడం... పెండ్లి చేసే తీరు... హిందూ వివాహ వ్యవస్థను అవహేళన చేసేదిగా ఉంది.
| Powered by web analytics software. |