Free SMS And Earn Part Time Money







7/19/09

'శంకరాభరణం', 'శృతిలయలు' లా తీద్దామనుకుని కలవరపడ్డారు



'శంకరాభరణం', 'శృతిలయలు' వంటి సినిమాలు తీసే రోజులా ఇవి?(ఒకవేళ తీసినా ఆ స్థాయి సంగీతం సపొర్ట్ లేకుండా......) కావనుకునే కళాతపస్వి కె.విశ్వనాథ్ కెమెరా వెనక్కి వెళ్లడం మానేశారు. 'రాధాగోపాళం', 'సుందరాకాండ' వంటి చేదు అనుభవాలు బాపూకి కూడా తప్పలేదు. విశ్వనాథ్ సినిమాలా తన తాజా చిత్రం ఉందని అనిపిస్తే అందుకు గర్విస్తానని దర్శకుడు సతీష్ కాసెట్టి ముందే చెప్పుకొచ్చారు. అయితే విశ్వనాథ్ తీసిన నాలుగైదు సినిమాల ఇన్ ఫ్లుయెన్స్ సతీష్ తీసిన 'కలవరమేయే మదిలో' చిత్రంపై కనిపిస్తుంది. అనాటి కళాఖండాలను గుర్తుచేసే ప్రయత్నం పొరపాటు కాదు. అయితే అలాంటి 'మిక్సింగ్'తో సినిమా తీసినంత మాత్రాన సరిపోదు. ఇవాల్టి యువతరం నాడిని ఆకట్టుకునే విధంగా స్క్రీన్ ప్లే పనితనం, సన్నివేశాల బలం వంటివి అనివార్యం. వీటికి కనెక్టివిటీగా వినోదం అనేది కూడా తగిన మోతాదులో ఉండాలి. ఉదాహరణకు కథానాయిక హీరో మహేష్ వీరాభిమాని అనే పాయింట్ మీదే సినిమా మొత్తం నడిపి వినోదాల పంట పండించిన 'అష్టాచమ్మ'ను చెప్పుకోవచ్చు. అందులో కథానాయిక స్వాతి చేసిన అల్లరి సినిమాను విజయపథంలోకి తీసుకెళ్లింది. అదే స్వాతి ఇప్పుడు 'కలవరమాయే మదిలో' అన్నప్పుడు ప్రేక్షకులు కూడా ఆమె నుంచి అలాంటి స్పాంటేనియస్ అల్లరి, చిలిపిదనాన్నే ఆశించడం సహజం. ఆరంభంలో స్వాతి తనను తాను పరిచయం చేసుకుంటూ తన ఆశలు, ఆశయాలు గడగడా చెప్పేస్తుంటే...ఇంకేం...బోలెడంత ఎంటర్ టైన్ ఇందులోనూ ఉంటుందనే అభిప్రాయం కలుగుతుంది. కొంతసేపు అలాంటి నడకే నడిచినా ఆ తర్వాత స్వాతి ఒకదాని వెంట మరో కష్టాల కలవరంతో అల్లల్లాడుతుంది. ఆ కష్టాలు చూసి అనుకొన్నదొకటి..అయినది మరొకటి అనే 'కలవర' పాటు వీక్షకులకూ సో(పా)కుతుంది. శ్రేయ (స్వాతి) తన తల్లి (ఢిల్లీ రాజేశ్వరి)తో కలిసి ఉంటూ ఓ ఆడిట్ ఆఫీసులో పనిచేస్తుంటుంది. శ్రేయకు పాడటం అంటే ప్రాణం. ఎప్పటికైనా ఎ.ఆర్.రెహమాన్ కంపోజిషన్ లో తాను పాడాలనేది ఆమె డ్రీమ్. అయితే శ్రేయ తల్లికి మాత్రం శ్రేయ సింగర్ కావాలనుకోవడం ఏమాత్రం ఇష్టం ఉండదు. అందుకు ఓ ఫ్లాష్ బ్యాక్ కూడా ఉంటుంది లెండి. అమ్మ కోసం జాబ్ చేస్తూ డబ్బుల సంపాదన కోసం ఓ స్టార్ హోటల్ లో శ్రేయ పాటలు పాడుతుంటుంది. లండన్ తిరిగి స్వదేశానికి వచ్చిన శ్రీను (కమల్ కామరాజు) ప్రతిరోజూ ఆ హోటల్ లో శ్రేయ పాట వింటుంటాడు. అందరూ చప్పట్లు కొట్టినా అతను మాత్రం సైలెంట్ గా ఉండిపోతుంటాడు. ఇది శ్రేయకు నచ్చదు. అతనితోనే అమీతుమీ తేల్చుకోవాలనుకుంటుంది. ఈ క్రమంలోనే ఇద్దరి మధ్యా పరిచయం పెరుగుతుంది. శ్రేయ ఆశయానికి అతను ప్రోత్సాహం అందిస్తుంటాడు. సంగీత విద్యాంసుడైన రావు (విక్రమ్ గోఖలే) ఒకరోజు తన సహచరుడైన శాస్త్రితో (తనికెళ్ల భరణి) కలిసి ఆ హోటల్ కు వచ్చి శ్రేయ పాట వింటాడు. ఆగ్రహంతో ఊగిపోతూ 'నువ్వు పాడేది కూడా ఓ పాటేనా?' అని గద్దిస్తాడు. దీంతో శ్రేయ చిన్నబోతుంది. తనకు పాడటమే రాదన్న రావు వద్దే సంగీతం నేర్చుకోవాలని శ్రేయ నిశ్చయించుకుంటుంది. అయితే ఆమె కోరికను రావు తోసిపుచ్చుతాడు. సంగీతం నేర్పేదిలేదంటాడు. శాస్త్రిని మంచి చేసుకుని పనిపిల్లగా రావు ఇంట్లోకి శ్రేయ అడుగుపెడుతుంది. ఒకవైపు శాస్త్రిని ఒప్పించేందుకు పడేపాట్లు, మరోవైపు శ్రీనును ఆకర్షించేందుకు చేసే ప్రయత్నాలతో కథ నడుస్తుంటుంది. షడన్ గా స్టోరీలో ఓ ఊహించని 'మలుపు' చోటుచేసుకుంటుంది. ఇక స్టోరీ ట్రాక్ మారుతుంది. శ్రేయను కలవర పరచిన ఆ ట్విస్ట్ ఏమిటి? రెహ్మాన్ కంపోజిషన్ లో పాడాలనే శ్రియ డ్రీమ్ ఎలా నెరవేరిందనేది మిగతా కథ.



Powered by web analytics software.