తెలుగు చలనచిత్ర పరిశ్రమలో నవ్వుల దర్శకుడిగా పేరుగాంచిన ఈవీవీ.సత్యనారాయణ శుక్రవారం రాత్రి కన్నుమూశారు. ఆయన వయస్సు 53 సంవత్సరాలు. గత కొంతకాలంగా కేన్సర్తో బాధపడుతున్న ఆయనను రెండు రోజుల క్రితం ఆపోలో ఆస్పత్రిలో చేర్చారు. ఆయన మెల్లగా కోలుకుంటున్న సమయంలో శుక్రవారం గుండెపోటు రావడంతో చనిపోయినట్టు వైద్యులు వెల్లడించారు.
పశ్చిమగోదావరి జిల్లా కోరుమామిడికి చెందిన ఈవీవీ పూర్తిపేరు ఈదర వీరవెంకట సత్యనారాయణ. 'చెవిలో పువ్వు' సినిమాకు ఈవీవీ తొలిసారి దర్శకత్వం వహించారు. 'వారసుడు', 'హలో బ్రదర్', 'అల్లుడా మజాకా' వంటి సూపర్ హిట్ చిత్రాలకు ఈవీవీ దర్శకత్వం వహించారు. ఈయనకు తెలుగు హీరోలు అల్లరి నరేశ్, ఆర్యన్ రాజేశ్ అనే ఇద్దరు కుమారులు ఉన్నారు.
సురేష్ ప్రొడక్షన్ బ్యానర్పై వచ్చిన 'ప్రేమఖైదీ' చిత్రంతో ఆయన తొలి విజయాన్ని నమోదు చేసుకున్నారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు 51 చిత్రాలకు దర్శకత్వం వహించారు. ప్రముఖ దర్శకుడు జంధ్యాల వద్ద అసిస్టెంట్గా పలు చిత్రాల్లో పని చేసిన ఈవీవీ సినిమాల్లో వినోదాన్ని పండించడంలో తనకుతానే సాటి.
ప్రధానంగా 'కామెడీ కింగ్' రాజేంద్ర ప్రసాద్తో ఈవీవీ తీసిన అనేక చిత్రాలు ప్రేక్షకాదరణ పొందాయి. తన కుమారులైన అల్లరి నరేశ్, ఆర్యన్ రాజేష్లతో 'బెండు అప్పారావు', 'ఎవడిగోల వారిది', 'అత్తిలి సత్తిబాబు', 'కితకితలు' తదితర చిత్రాలను నిర్మించారు. వీటితో పాటు.. సీరియస్ హీరో శోభన్బాబుతో 'ఏవండీ ఆవిడ వచ్చింది', అమితాబ్ బచ్చన్తో 'సూర్యవంశ్' (హిందీ), 'ఆమె', 'తాళి', 'ఆమ్మో ఒకటో తారీఖు' వంటి కుటుంబ కథా చిత్రాలను కూడా నిర్మించి టాలీవుడ్లో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నాడు.
Kantheti Naresh